ఇల్లు అలికి ముగ్గు పెడితేనే పండగ. ముగ్గులు లేని లోగిళ్ల సంక్రాంతిని ఊహించలేము. చుక్కలు, రేఖలు సంస్కృతికి చిహ్నాలు. ముగ్గులు మానవ మనుగడలో ప్రధానాక్షరాలు.
ఆ విశేషాలే ఇవి.
ధనుర్మాసం ఆరంభం నుంచి గ్రామాల్లో ఇళ్ళ ముంగిట రంగవల్లులను తీర్చిదిద్దడం సంప్రదాయం. స్ర్తీలలో సృజనాత్మకతకు, కళానైపుణ్యానికి ప్రతీక రంగవల్లులు. ఈ ముగ్గుల్లో ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి. గుల్లముగ్గు తయారు చేసుకుని అందులో ఇసుక, బియ్యపుపిండి కలిపి ముగ్గు వేస్తారు. పేడను లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఆవు పేడ పవిత్రతకు, ఆరోగ్యానికి ప్రతీక. ఆవుపేడ కలిపిన నీళ్ళను వాకిళ్ళలో చల్లడం వల్ల, గుల్ల ముగ్గు ఘాటుకు సూక్ష్మక్రిములు నశిస్తాయి. ముగ్గుల్లో కలిపే బియ్యపు పిండి వల్ల చీమలకు ఆహారం దొరుకుతుంది. సంక్రాంతి నెలలో ముగ్గులను ముత్యాల పందిరి ముగ్గుతో ప్రారంభించి రథం ముగ్గుతో ముగించడం ఆనవాయితీ.
ధనుర్మాసంలో తెల్లవారుజామునే ముగ్గులు వేయడానికి ప్రత్యేక కారణం ఉంది. శీతాకాలంలో శరీర అవయవాలన్నీ బిగుసుకుంటాయి. ముఖ్యంగా మహిళల్లో వెన్నెముక భాగం సక్రమంగా పనిచేయడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి పరోక్షంగా దోహదపడతాయి. కల్లాపికి అవసరమైన నీళ్ళు తీసుకురావడానికి బకెట్ పట్టుకోవడానికి త్రికోణాసనంగా పేర్కొంటారు. దీనివల్ల నడుంనొప్పి రాకపోవడమే కాకుండా వెన్నెముక సంపూర ్ణ ఆధీనంలో ఉండి నాడీ మండలానికి రక్తప్రసరణ సజావుగా సాగుతుందంటారు పెద్దలు.
చుక్కలముగ్గులు వేసే సమయంలో రెండు కాళ్ళపై బలం మోపడం జరుగుతుంది. ఈ భంగిమ మూత్రపిండాలకు చక్కటి వ్యాయామం. అలాగే కుడిచేతితో ముగ్గులు పెట్టే సమయంలో కుడిచేయి కదులుతుంది. వెనుకకు, ముందుకు, పక్కకు తిరుగుతుంది. వంగినప్పుడు కొంత గాలిని బంధించాల్సి వస్తుంది. దీనిని ఉద్వాన బంధన అని పేరు. ఇలా చేయడం వల్ల ఉదరంలో వాయువు నిరోధించబడుతుంది. పైగా పొట్టపై ఉన్న అధిక కొవ్వు కరిగే అవకాశం ఉంది. అప్రయత్నంగానే ప్రాణాయామం చేసినట్లవుతుంది. రక్తశుద్ధికి దోహదం చేస్తుంది. అదే స్థితిలో శ్వాసవదిలి ఆపడాన్ని బాహ్యకుంభణం, శ్వాస పీల్చి వదలడాన్ని అంతరకుంభణం ఉంటారు. ఈ యోగముద్రల్లో వాయుస్తంభనం, వాయు విస్పోటనం జరుగుతుంది. దీనివల్ల రక్తప్రసరణ సజావుగా సాగి రక్తశుద్ధి జరుగుతుంది.
వేదకాలం నుంచే ముగ్గులు పెట్టేవారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. కృతయుగంలో ఆశ్రమాల్లో యజ్ఞయాగాదులు, క్రతువులు జరిపే సమయంలో హోమగుండాలను ముగ్గులతో అలంకరించేవారు. రామాయణంలో పల్లెటూరి సంప్రదాయాలను వాల్మికి వర్ణించే సమయంలో ముగ్గులను ప్రస్తావించారు. ద్వాపరయుగంలో ద్వారకాబృందావనం వర్ణనలో ముగ్గుల ప్రస్తావన ఉంది. గోపెమ్మలు రంగవల్లులు వేసి కృష్ణుని ఆహ్వానించేవారు. ఈ నాటికీ కృష్ణాష్టమికి ముగ్గులతో కృష్ణుని పాదాలు వేయడం చూస్తూనే ఉన్నాం. ముత్యాల ముగ్గువేస్తూ అంగనలు ఆడే ఆటలను, పాటలను తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య తన పాటలలో కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తూ ముగ్గు ప్రత్యేకత వివరించారు.
No comments:
Post a Comment