WORLD FLAG COUNTER

Flag Counter

Friday 28 February 2014

HEALTHY USES WITH IODIZED SALT - USE ALWAYS IODIZED SALT



మీ ఉప్పులో ఐరన్ ఉందా?

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయప పడాలంటే ఆహార నియమాలు పాటించడమే ప్రథమ చికిత్స. నిజమైన చికిత్స కూడా' అంటున్నారు వైద్య నిపుణులు.

రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ పదార్థం తయారుకావడానికి పోషక పదార్థాలైన మాంసకృత్తులు, ఇనుము ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ లెక్కన మగవారిలో ప్రతి 100గ్రాముల రక్తంలో 13 గ్రా., ఆడవారిలో 12 గ్రా., 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11గ్రా., గర్భిణీ స్త్రీలలో 11 గ్రా., బాలింతల్లో 12గ్రా., 7-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రా. హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ ఈ మోతాదు విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో వారు బాధపడుతున్నారని అర్థం. రక్తహీనతకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య తగ్గిపోతుంది. ఆర్‌బీసీ(రెడ్ బ్లడ్ సెల్స్)లోని హిమోగ్లోబిన్, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. అంటే ఆక్సిజన్ రవాణా వ్యవస్థగా ఎర్ర రక్తకణాలు పనిచేస్తాయి.

ప్రధానమైన బలహీనత
మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనతలు రక్తం హీనత. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. రక్తం నష్టపోవడం, రక్తం ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడం, పౌష్టికాహారలోపం. అయితే, సాధారణ పనులకే ఆయాసం రావడం, బలహీనం, నిరాశక్తత, ఆలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 ఏళ్ల వయసుగల మహిళల్లో, పదకొండు సంవత్సరాలలోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. రుతుచక్రం సమయంలో అధిక రక్త స్రావం కావడం వల్ల, పైల్స్ సమస్య వల్ల కూడా ఎనీమియా సంభవించవచ్చు. కొద్ది మంది మగవాళ్లలో కూడా రక్తహీనత సంభవిస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువతో బిడ్బ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, వెంటనే వెంటనే రోగాలు రావటం, చదువులో వెనకపడటం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

రక్తహీనత ఉన్నవారు ప్రధానంగా ఆహార నియమాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలు. ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం తప్పనిసరిగా చేయాలి. రక్తహీనత ప్రమాదకరమైనది కాబట్టే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక పెట్టి ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా అందజేస్తోంది.

ఇనుము కలిసిన ఉప్పుతో...

నిజానికి దేశంలో అధిక శాతం జనాబా రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు ఏర్పడిన కొత్త మార్గం ఇనుము కలిపిన ఉప్పును వినియోగించటం. దీన్ని జాతీయ పోషకహార సంస్థవారు కనుగొన్నారు. సాధారణ ఉప్పుకు బదులు కొత్తగా తయారు చేసిన ఈ ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడటం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. ప్రస్తుతం ఇనుము కలిపిన ఉప్పు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే దొరుకుతోంది.

విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండు, యాపిల్, ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం మానేయాలి. ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తహీనతను అశ్రద్ధ చేయవద్దు. అది కేవలం నీరసానికి మాత్రమే దారి తీయదు. ప్రాణహాని కూడా కలుగవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటిస్తూనే వైద్యులను సంప్రదించడం సరైన పని.

No comments:

Post a Comment