WORLD FLAG COUNTER

Flag Counter

Friday 28 February 2014

HEALTHY MOODS - HEALTHY FOOD HABITS



మూడ్‌ని బట్టే ఆరోగ్యం

భోజనం చేసేటప్పుడు మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం వంటబట్టాలన్నా, ఆరోగ్యానికి ఉపయోగపడాలన్నా భోజనం దగ్గర మన మూడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా ముఖ్యమని, ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా మన మూడ్స్‌ను బట్టే ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆరోగ్యం పైన మనసు ప్రభావం చాలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మందులు వేసుకున్నా, భోజనం చేస్తున్నా, చివరికి స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ పనైనా చక్కగా పూర్తి చేయాలన్నా దాని మీద శరీర ప్రభావమే కాక, మనసు ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

భోజనం విషయానికి వస్తే, చాలా మంది భావోద్వేగంతోనే భోజనాన్ని పూర్తి చేస్తుంటారని డెలవేర్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గార్డ్‌నర్ తెలిపారు. ఆబగా, అనాలోచితంగా, ఆశగా తినడం, రుచి కోసం తినడం వంటివి సాధారణంగా మనకు కనిపించే భోజన రీతులు. వీటన్నిటితో పాటు, భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా, క్రోధంగా ఉన్నామా, మానసిక ఒత్తిడిలో ఉన్నామా లేక హడావిడిలో ఉన్నామా అన్నవి కూడా చాలా వరకూ ఆహార పదార్థాల మీద పనిచేస్తుంటాయని ఆయన ఆధ్వర్యంలో 'ఆరోగ్యానికి, భోజనం తినే విధానానికి ఉన్న సంబంధం'పై అధ్యయనం చేసిన నిపుణులుచెబుతున్నారు.

ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోకూడదు, ఏ మూడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి అన్న దాన్ని ఈ నిపుణులు పరిశీలించి, వాటిని వ్యాసాల రూపంలో వివిధ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంబంధమైన మేగజైన్లలో ప్రచురించారు. ఎంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పళ్లెంలో పెట్టుకున్నా మనసు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే ఆ భోజనం ఇచ్చే శక్తి చాలా తక్కువగానే ఉంటుందట. భావోద్వేగంతో భోజనం తిన్నా అది గుండె మీదా, రక్త ప్రసారం మీదా దుష్ప్రభావాన్ని కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనమే కాదు, అల్పాహారం తీసుకునేటప్పుడు, స్నాక్స్ తీసుకునేటప్పుడు, మద్య సేవనం చేస్తున్నప్పుడు పండ్లు తినేటప్పుడు, చివరికి మందులు తీసుకునేటప్పుడు కూడా మనసును ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు.

మూడ్స్ బాగా లేనప్పుడు అంటే, విషాదం, భావోద్వేగం, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, పగ, ప్రతీకారం వంటివి ఆలోచనలను ముప్పిరిగొని ఉన్నప్పుడు ముందుగా కొద్దిగా మంచినీళ్లు తాగి, కాళ్లు కడుక్కుని, కొద్దిగా మనసు శాంతించిన తరువాత భోజనం ముందు కూర్చోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మన సు అలజడితోనో, కల్లోలంగానో ఉన్నప్పుడు, అంటే ప్రశాంతంగా లేనప్పుడు తినే భోజనమంతా రక్తాన్ని దోషభూయిష్ఠం చేసే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రసారంలో తేడాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల, గుండె కొట్టుకోవడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. వీటి ప్రభావం దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి కీలక అవయవాల మీద కూడా పడుతుంది. కొద్ది కాలంలోనే చిత్ర విచిత్రమైన అనారోగ్యాలు శరీరాన్ని పీడించడం ప్రారంభిస్తాయి.

ఆవేశకావేషాలతో భోజనం చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే తలనొప్పి, రక్తపోటు, గుండె దడ వంటివి ప్రారంభమైపోతాయి. కోప తాపాలలో ఉన్నప్పుడు భోజన పదార్థాల ఎంపికలో కూడా తేడాలు వస్తాయని, శరీరానికి ఏది పడదో అటువంటి పదార్థాన్నే ఎంపిక చేసుకునే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే భోజనం చేయడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ఎంతో మంచిదని వారు సలహా ఇస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసినా, జోక్స్ వేసుకుంటూ తిన్నా, సంతోషంగా తిన్నా, చివరికి భవిష్యత్తు గురించి కలలు గంటూ ఆహారం తీసుకున్నా దాని ప్రభావం శరీరం మీద, ఆరోగ్యం మీదా సానుకూలంగా ఉంటుందని, శరీరానికి అదనపు శక్తి సమకూరుతుందని వారు సూచిస్తున్నారు.

విచిత్రమేమిటంటే, మూడ్స్ బాగా లేనివారే ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తీసుకుంటూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మనసు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నవారు చక్కటి ఆహార పదార్థాలు, పండ్లు, పచ్చి కూరలు, రసాలతో భోజనం చేస్తారట. మనసు బాగా లేనివారు ఆరోగ్యకరమైన పదార్థాల కంటే ఉత్తేజపరిచే లేక కిక్ ఇచ్చే పదార్థాల కోసం చూసుకుంటారు. రుచులకు ప్రాధాన్యం ఇస్తారు. మనసు హాయిగా ఉల్లాసంగా ఉన్నవారు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం మీదే దృష్టి పెడతారు. అందువల్ల మూడ్స్ మీదే ఆహార పదార్థాల ఎంపిక, సేవనం ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదాంశం. 

మూడ్స్‌ను ఉల్లాసంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యం పుష్టిగా మారుతుంది. దాని మీదే ఆయుర్దాయం కూడా ఆధారపడి ఉంటుంది. సారాంశం ఏమిటంటే, జీవితాన్ని ప్రతి క్షణం ఉల్లాసంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తే రోగ భయం లేని దీర్ఘాయువు మీ సొంతం అవుతుంది.

No comments:

Post a Comment