WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 20 December 2014

MAHABHARATHA STORY ABOUT THE GREAT WARRIOR AHBIMANYU IN TELUGU


కురుక్షేత్రంలో అభిమన్యుని సాహసం

పూర్వం ‘‘మహాభారతం’’లో పాండవులు, కౌరవుల మధ్య కొన్ని రోజులపాటు ‘‘కురుక్షేత్ర సంగ్రామం’’ (యుద్ధం) ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు. ఈ యోధులలో భీష్మ పితామహుడు, కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటివారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యంకోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. వీరిలో అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది. అతి చిన్న వయస్సులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి, శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. సుభద్ర, అర్జునుల కుమారుడయిన అభిమన్యుడు... తల్లి కడుపులో వున్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేధించే విద్య గురించి తెలుసుకున్నాడు. అటువంటి వీరుడైన అభిమన్యుని వైనం గురించి కొన్ని విశేషాలు...

కురుక్షేత్ర యుద్ధం మొదలైన మొదటి నుంచి ఎంతో భయంకరంగా సాగుతోంది. పాండవులు, కౌరవుల తరఫు నుంచి ఎందరో మహావీరులు, సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అలా ఘోరంగా సాగిన యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది. కౌరవులు, పాండవులను ఓడించేందుకు ద్రోణాచార్యుని సహాయంతో పద్మవ్యూహం పన్నాగం పన్నుతారు. ఎంతో క్లిష్టతరమైన ఈ వ్యూహాన్ని ఛేదించడంలో పాండవులు, వారి సైన్యం వెనకుండిపోతుంది. కౌరవులు పన్నిన వ్యూహంతో సైనికులను చంపుకుంటూ ముందుకు వెళ్లిపోతారు.

ఆ సమయంలో ధర్మరాజు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుని సహాయం కోరుకుంటాడు. ధర్మరాజు, అభిమన్యునితో.. ‘‘అభిమన్యుడా..! ఈ భయంకరమైన పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య కేవలం శ్రీకృష్ణుడు, మీ నాన్న అర్జునునికి, శ్రీకృష్ణుని కొడుకైన ప్రద్యుమ్నునికి, నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో వీరెవ్వరూ ఇక్కడ లేరు. కాబట్టి ఈ వ్యూహాన్ని ఛేధించే మొత్తం భారం నీమీదే వుంది. సైన్యాధిపతి బాధ్యతలను స్వీకరించి, సైన్యాన్ని నీ వెంట తీసుకువెళ్లు’’ అని వేడుకుంటాడు.

దానికి సమాధానంగా అభిమన్యుడు.. ‘‘పెదనాన్న (ధర్మరాజు) గారు! నేను మీకు ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో పనికి వస్తానని ఏనాడు అనుకోలేదు. కానీ ఈరోజు నాకు ఇంతటి సౌభాగ్యం కలిగించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను వయస్సులో చిన్నవాడయినా.. వీరబలశాలి అయిన అర్జునుడు, సుభద్ర కుమారుణ్ణి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య గురించి నేర్చుకున్నవాణ్ణి. నేను కేవలం పద్మవ్యూహాన్ని ఛేధించి లోనికి వెళ్లే వరకు మాత్రమే విద్యను సంపాదించుకోగలిగాను. వెనక్కి వచ్చే మార్గం గురించి తెలుసుకోలేకపోయాను. అయినా నేను నేర్చుకున్న ఈ విద్యను ఉపయోగించి, మీకు సహాయం పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెబుతాడు.

ధర్మరాజుకు ఇచ్చిన మాట ప్రకారం అభిమన్యుడు ఎంతో ఉత్సాహంగా కౌరవులు పన్నిన పద్యవ్యూహాన్ని సునాయాసంగా ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతాడు. పాండవుల సేన కూడా అతనిని అనుసరిస్తూ కౌరవసేనను మట్టి కరిపిస్తూ వెళ్లారు. కొంత సమయం వరకు అభిమన్యుడు తను నేర్చుకున్న విద్యతో అపార ప్రతిభను ప్రదర్శించాడు. అది గమనించిన కౌరవ సేనులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ వారు యుద్ధంలో ఓడిపోతారోనన్న భయం వారిలో ఒక్కసారిగా కలచివేసింది.

అప్పుడు శకుని ఎలాగైనా అభిమన్యున్ని చంపాలనే నెపంతో.. తన తెలివితేటలతో, మాటలతో అతనిని పొగడ్తలతో ముంచెత్తుతాడు. చిన్న వయస్సులో వున్న అభిమన్యుడు, శకుని మాటలతో ఉత్సాహాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు కౌరవ సైన్యం ఒక్కసారిగా అభిమన్యుని మీద విరగబడతారు. కత్తులు, బాణాలు, గదలతో అతని మీద విరుచుకుపడతారు. చిన్న వయస్సులోనే అభిమన్యుడు తన విద్యతో కౌరవ సైన్యాన్ని మట్టి కరిపించి, తను కూడా నేలకొరిగాడు. ఉన్న కొద్దిసమయం వరకు విజయవంతంగా పోరాడి.. చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. ఎందరో యువసైనికులకు ఆదర్శంగా నిలిచాడు.

No comments:

Post a Comment