పసిడికాంతులకు పసుపు
సహజ ఔషధ గుణాలెన్నో కలిగిన పసుపుతో అరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు. అందాన్ని మెరుగుపరుచుకునే సుగుణాలూ ఉన్నాయి.
వంటింట్లో తప్పనిసరిగా ఉండే దీనితో సౌందర్య పోషణ ఎలాగో చూద్దామా...!
చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి తగినన్ని పాలను చేర్చి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే చాలు...ఇలా కనీసం ఓ నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే యాక్నే, మొటిమలు వాటి తాలూకు మచ్చలు వంటివి దూరమవుతాయి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు దారితీసే కారకాలతో పోరాడతాయి.
* కాలం ఏదైనా సరే కొందరి ముఖం ఇట్టే జిడ్డుకారుతుంది. ఇలాంటప్పుడు పరిష్కారంగా పసుపుతో ఈ పూతను ప్రయత్నించి చూడండి. రెండు చెంచాల గంధం పొడి, చిటికెడు పసుపుకి రెండు టేబుల్ స్పూన్ల కమలాఫల రసం కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే సమస్య దూరమవుతుంది. పసుపు చర్మంలో ఉత్పత్తి అయ్యే సీబమ్ని నియంత్రిస్తుంది.
* ముప్ఫైలకు చేరుకుంటున్నామనేప్పటికి ముఖంపై సన్నటి గీతలూ కనిపిస్తుంటాయి. కప్పు బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, కాసిని పచ్చిపాలు, రెండు టేబుల్ స్పూన్ల టొమాటో రసం కలిపి మరీ గట్టిగా కాకుండా ముద్దచేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని నలుగులా పెట్టుకోవాలి. ఆపై మరో పది నిమిషాలు అలానే ఆరనిచ్చి ముఖం కడిగేసుకుంటే సరి. ముడతలు, మృతకణాల వంటివి పోయి చర్మం నునుపుగా, కాంతిమంతంగా తయారౌతుంది. క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మం చాయ మెరుగుపడుతుంది.
No comments:
Post a Comment