WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 7 January 2015

PURANA FACTS ABOUT LORD VIGNESWARA


పురాణాల్లోంచి కొన్ని వినాయక విశేషాలు

విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం

మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ,విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.

గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.

వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు.వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.

విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య 21తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.

వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .
ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.

విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు. కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .

గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.

గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.

భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.

శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది.దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.

ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).

గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).

No comments:

Post a Comment