WORLD FLAG COUNTER

Flag Counter

Monday 30 December 2013

OM NAMAH SIVAYA - MEANING OF OM NAMAHSIVAYA MANTRAM IN TELUGU




నమశ్శివాయ :

ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.

శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం.

ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. న భూమికి సంబంధించిన భాగాలను, మ నీటికి సంబంధించిన భాగాలను, శి అగ్నికి సంబంధించిన భాగాలను, వ గాలికి సంబంధించిన భాగాలను, య ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.



No comments:

Post a Comment