భూలోక స్వర్గం 'బోథ్ జలపాతాలు'
ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ఎంతో మనోహరం గా దర్శనమిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండలు, లోయలు, గలగల పారే సెలయేళ్లు, జింకవోలే దూకే జలపాతాలు బోథ్ ప్రాంతంలో అధికంగా వుండడం ఆదిలాబాద్ జిల్లాకు అందం... వరం. బోథ్ ప్రాంతంలో మొత్తం 7 జలపాతాలు వుండటంతో ఈ ప్రాంతాన్ని 'సప్త గుండాల బోథ్'గా అభివర్ణిస్తుంటారు. ఈ జల పాతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన జలపాతా లు ఒకటి కుంటాల కాగా, రెండవది పొచ్చర జలపాతం. మిగిలిన జలపాతాలు నాగరికుల కంట పడకుండా ప్రకృతి ఒడిలోనే దాగి పోతు న్నాయి. అయినా జలపాతాలను వీక్షించాలన్న తపనతో పై రెండింటితో పాటు మిగతా జలపాతా లను కూడా పర్యాటకులు సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జలపాతంగా గుర్తించబడిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి 12 కి.మీ.దూరంలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య గల ఈ జలపాతానికి అలనాడు శకుంతల, దుష్యంతుడు విహారయాత్ర కోసం ఇక్కడికి వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. వారి రాక ఆధారంగానే ఈ జలపాతానికి కుంతల జలపాత మని పేరు వచ్చిందని నానుడి. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి వయ్యారంగా జాలు వారే ఈ జలపాతం వీక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. జలపాతానికి సమీపంలో ఒక రాయిపై సోమేశ్వర ఆలయం ఉంది. కేవలం పది మంది మాత్రమే పట్టేవిధంగా ఉండే సోమేశ్వర ఆలయం ఒక గుహ లో ఉంది. అయితే ఈ దేవాలయానికి దక్షిణ దిశలో ఒక పెద్ద సొరంగం కూడా ఉంది. ఈ సొరంగం శ్రీకాళహస్తి వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. సోమేశ్వర ఆలయంలో నంది, పానపట్టం విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏకశిల గుహలోకి వెళ్లేటప్పుడు మొదట చీకటిగా ఉండి ఆ తరువాత కొద్దిగా వెలుతురు కనిపిస్తుంది. అక్కడక్కడ అమర్చిన రాళ్లు, తాడు వంటి వాటి సహాయంతో ఆ గుహలోకి వెళ్లి సోమేశ్వరుని దర్శించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా వచ్చి సోమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. ఇదిలావుంటే బోథ్ ప్రాంతం లోని మరో జలపాతం పొచ్చర జలపాతం. ఈ జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జాతీయ రహదారిలో దిగి వెళ్లే మార్గంలో ఈ జలపాతం ఉంది. పొచ్చర గ్రామ సమీపంలో చిన్న కొండవాగు రాళ్లపై నుంచి దూకే ఈ దృశ్యం ఎంతో మనోహరంగా దర్శనమిస్తుంది. ఏ కాలంలోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. ఒకప్పుడు ఈ జలపాతానికి వెళ్లేందుకు రహదారి కూడా ఉండేది కాదు. ఇప్పుడు రహదారి ఏర్పాటుతో పాటు అక్కడ విద్యుత్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు జలపాతం చుట్టూ అందమైన మొక్కలతో తీర్చిదిద్ద డమే కాకుండా ఒక వృక్షం నుంచి దేవత ఉద్భవి స్తున్నట్లు అందంగా తీర్చిదిద్దారు. సెలవు వేళల్లో ఇతరత్రా సమయాల్లో పర్యాటకులు, ఆయా పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి చేరుకొని ప్రకృతి ఒడిలో సేద తీరుతారు. బోథ్ ప్రాంతంలో జల పాతాలతో పాటు గాయత్రీ, బుంగనాల, సవతుల గుండం వంటి జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
No comments:
Post a Comment